వారంతా మున్సిపాల్టీలో ఒక సంస్థ తరఫున పనిచేసే చిరు మహిళా ఉద్యోగులు. ప్రభుత్వం నిర్వహించే లాటరీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. 250 రూపాయలు పెట్టి లాటరీ టిక్కెట్ కొనడానికి గ్రూపులోని 11 మంది మహిళలు నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో కొందరి వద్ద తమ వాటాగా చెల్లించే 25 రూపాయలు కూడా చేతిలో లేవు. అయితే అలా కొన్న వారి టిక్కెట్ను అదృష్ట లక్ష్మీ వరించింది.
రూ.10 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని అందరూ సమానంగా పంచుకుంటామని వారు తెలిపారు. కేరళలోని పరప్పన్గడి మున్సిపాల్టీలో హరిత కర్మ సేన తరఫున పనిచేసే మహిళలకు కేరళ లాటరీ శాఖ నిర్వహించే లాటరీలో బుధవారం 10 కోట్ల జాక్పాట్ తగిలింది. బయో డీగ్రేడబుల్ వ్యర్థాలను ఇళ్లు, సంస్థల నుంచి సేకరించి రీ సైక్లింగ్ యూనిట్లకు తరలించే పనిచేస్తున్న తమకు ఇంతకాలం ఈ ఉద్యోగాలే జీవనాధారంగా ఉన్నాయని తెలిపారు. కేరళ లాటరీ ఈ సారి సరైన వారికి తగిలిందంటూ కొందరు మున్సిపల్ ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.