Biryani | కేరళలో విషాదం చోటు చేసుకుంది. బిర్యానీ తిని ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. కాసరగోడ్ (Kasaragod) సమీపంలోని పెరుంబల (Perumbala) ప్రాంతానికి చెందిన 20 ఏండ్ల యువతి అంజూ శ్రీపార్వతి.. డిసెంబర్ 31వ తేదీన రొమాన్సియా (Romansia) రెస్టారెంట్ నుంచి ‘ఖుజిమంతి’ (Kuzhimanthi) బిర్యానీని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంది. అది తిన్నప్పటి నుంచి ఆమెకు వాంతులు, వీరేచనాలు మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు యువతిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
అయితే ఆరోగ్యం ఎంతకూ మెరుగుపడక పోవడంతో మెరుగైన చికిత్స కోసం కర్ణాటలోని మంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం అంజూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై యువతి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ తీవ్రంగా స్పందించారు. వెంటనే దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
కాగా, రాష్ట్రంలో వారంలోనే ఇది రెండో ఘటన కావడం గమనార్హం. ఇటీవల కోజీకోడ్లోని కొట్టాయం మెడికల్ కళాశాలో ఓ నర్స్ ఆహారం తిన్నాక అస్వస్థతకు గురై మృతి చెందింది. ఈ ఘటన మరవకముందే ఇప్పుడు అంజూ పార్వతి మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.