తిరువనంతపురం: కేరళలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 34,199 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,68,383కు చేరింది. కరోనా కేసుల పెరుగుతుండటంతో మళ్లీ ఆసుపత్రుల్లో పడకలు కరోనా రోగులతో నిండుతున్నాయి. బుధవారం కొత్తగా 1094 మంది అడ్మిట్ అయ్యారు.
కాగా, జనవరి 1న కేరళలో 2,435 కరోనా కేసులు నమోదు కాగా, 169 మంది ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో 19 రోజుల్లో రోజువారీ కేసుల సంఖ్య 34 వేలు, రోజువారీ అడ్మిట్ల సంఖ్య వెయ్యిని దాటింది. గత రెండు వారాల్లో ఆసుపత్రిలో చేరిన కరోనా రోగుల సంఖ్య 60 శాతం మేర పెరిగింది. బుధవారం కొత్త కరోనా రోగుల అడ్మిషన్లు 113 శాతానికి చేరాయి. ఐసీయూలోని బెడ్లు 38 శాతం మేర నిండుకున్నాయి. జనవరి 11 నుంచి వెంటిలేటర్ల వ్యవస్థపై ఉన్న రోగుల సంఖ్య కూడా 9 శాతం మేర పెరిగింది. ఆక్సిజన్ బెడ్ల భర్తీ 52 శాతానికి పెరిగింది.
మరోవైపు కేరళలో బుధవారం కరోనాతో 49 మంది మరణించారు. అయితే కేంద్ర మార్గదర్శకాల మేరకు 85 మరణాలను అదనంగా చేర్చారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 51,160కి చేరింది.