తిరువనంతపురం: కేరళలో సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఐజీ లక్ష్మణ్ నాయక్ను అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నకిలీ పురాతన వస్తువుల అమ్మకం కేసులో నిందితుడు, యూట్యూబర్ మోన్సన్ మవుకల్తో ఐజీ లక్ష్మణ్ నాయక్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. నిందితుడితో సన్నిహిత సంబంధాల నేపథ్యంలో లక్ష్మణ్ నాయక్ సస్పెన్షన్ ఉత్తర్వులపై సీఎం సంతకం చేశారని తెలిపింది.
మోన్సన్ మవుకల్తో కేరళకు చెందిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గత నెలలో బయటపడింది. కేరళ మాజీ డీజీపీ లోక్నాథ్ బెహరా, ప్రస్తుత డీజీపీ అనిల్ కాంత్తో మోన్సన్ మవుకల్ సన్నిహితంగా దిగిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఐజీ లక్ష్మణ్ నాయక్ ఏకంగా మోన్సన్ మవుకల్ నకిలీ పురాతన వస్తువుల అమ్మకం వ్యాపారంలో కూడా పాలుపంచుకున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. మోన్సన్ మవుకల్తో బిజినెస్ పార్టనర్గా చేరాలని ఏపీకి చెందిన పలువురితో లక్ష్మణ్ నాయక్ మధ్యవర్తిత్వం కూడా నడిపినట్లు తేలింది.
లక్ష్మణ్ నాయక్ ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి. కేరళ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఐజీ హోదాలో కేరళ సీఎం పినరయి విజయన్కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. కేరళ ఐజీల్లో చాలా సీనియర్ అయిన లక్ష్మణ్ నాయక్కు వచ్చే జనవరి 1న అడిషనల్ డీజీపీగా ప్రమోషన్ ఖరారైంది. ఇప్పుడు సస్పెన్షన్కు గురికావడంతో కథ అడ్డం తిరిగింది.