తిరువనంతపురం: కేరళలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. వరుసగా ఐదో రోజు కూడా వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం కొత్తగా 1,544 వైరస్ కేసులు, నాలుగు మరణాలు వెలుగుచూశాయి. దీంతో ఆ రాష్ట్రంలో యాక్టివ్ కరోనా రోగుల సంఖ్య 8,000కు చేరింది. ఈ నేపథ్యంలో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ఒమిక్రాన్ తప్ప కరోనా కొత్త వేరియంట్లను గుర్తించలేదన్నారు. అయినప్పటికీ కేసుల పెరుగుతుండటాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, టీకా వేసుకోవాలని సూచించారు.
కాగా, మే 31న కేరళలో మరోసారి కరోనా కేసులు వెయ్యి మార్కును దాటాయి. 1,197 పాజిటివ్ కేసులు, ఐదు కరోనా మరణాలు నమోదయ్యాయి. జూన్ 1న 1,370 కేసులు, ఆరు మరణాలు, జూన్ 2న 1,278 కేసులు, 20 కరోనా సంబంధ మరణాలు, జూన్ 3న 1,465 కొత్త కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. దీంతో కేరళలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 65,63,910కు, మొత్తం మరణాల సంఖ్య 69,790కు పెరిగింది.