హైదరాబాద్: కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా ఎక్కువగానే ఉన్నది. అక్కడ ఇప్పటికీ రోజువారీ కేసుల సంఖ్య 20 వేలకు తగ్గడంలేదు. గడిచిన 24 గంటల్లో కూడా 20,240 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 43,75,431కి చేరింది. ఇక కొత్తగా 67 మంది కరోనా బాధితులు మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 22,551కి పెరిగింది.
గడిచిన 24 గంటల్లో మొత్తం 1,15,575 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 20,240 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే పాజిటివిటీ రేటు 17.51 శాతంగా ఉంది. ఇక కొత్తగా 29,710 మంది మహమ్మారి బారి నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 41,30,065కు పెరిగింది. ప్రస్తుతం కేరళలో 2,22,255 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని, వాటిలో ఎర్నాకుళం జిల్లాలో అత్యధికంగా ఉన్నాయని కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది.