తిరువనంతపురం : గణతంత్ర దినోత్సవ వేడుకల రోజునే జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఈ ఘటన కేరళలోని కాసర్గడ్లో బుధవారం చోటు చేసుకున్నది. స్థానిక మున్సిపాలిటీ స్టేడియంలో ఉదయం రిపబ్లిక్ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో రాష్ట్ర పోర్టు, ఆర్కియాలజీశాఖల మంత్రి అహ్మద్ దేవరకోవిల్ పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే, జెండాను తలకిందులుగా ఎగుర వేశారు. అనంతరం జెండావందనం చేసి, ప్రసంగించారు.
అయితే, జెండాను తలకిందులుగా ఎగుర వేసిన విషయాన్ని అక్కడనున్న అధికారులు గానీ, సిబ్బంది గుర్తించలేకపోయారు. కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన పలువురు మీడియా ప్రతినిధులు దీన్ని గుర్తించారు. ఆ తర్వాత అధికారులు జెండాను అవనతం చేసి, మళ్లీ సరిగ్గా ఎగుర వేశారు. అయితే, త్రివర్ణ పతాకాన్ని అవమానించినందుకు మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. జెండాను అవమానించిన మంత్రిపై, సంబంధిత అధికారులపై పోలీసులు కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ కోరారు.
తలకిందులుగా జెండాను ఎగుర వేసి, మంత్రి సెల్యూట్ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఇంత ఘోర తప్పిదం జరిగినా మంత్రి, అధికారులు లోపాన్ని గుర్తించకపోవడం హాస్యాస్పదమన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తన వైపు నుంచి ఎలాంటి పొరపాటు జరుగలేదని, సంబంధిత అధికారులు జెండా తాడును అందజేస్తేనే ఎగుర వేసినట్లు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా పోలీస్ చీఫ్, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ను కోరామన్నారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.