బెంగళూరు: ఒక వ్యక్తి రైలు కంపార్ట్మెంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. (Man Hangs in Train) ఈ విషయం తెలిసిన రైల్వే పోలీసులు, అధికారులు ఆ కంపార్ట్మెంట్ను వేరు చేశారు. దీంతో ఆ రైలు ఆలస్యంగా ఆ స్టేషన్ నుంచి కదిలింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బైయప్పనహళ్లిలోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ (ఎస్ఎంవీటీ)లో కారైకల్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉంది. బుధవారం ఉదయం ఆ రైలు కంపార్ట్మెంట్లోని ఫ్యాన్కు ఒక వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. అందులోకి ఎక్కిన ప్రయాణికులు ఇది చూసి షాక్ అయ్యారు. రైల్వే పోలీసులు, రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు.
కాగా, మృతుడి లగేజ్ను రైల్వే పోలీసులు, అధికారులు పరిశీలించారు. 45 ఏళ్ల మృతుడు కేరళకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. జనవరి 16న కేరళలోని త్రిసూర్ నుంచి బెంగళూరులోని కేఎస్ఆర్ స్టేషన్కు అక్కడి నుంచి మైసూరుకు అతడు ప్రయాణించినట్లు మృతుడి వద్ద ఉన్న రైలు టికెట్లు ఆధారంగా తెలుసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఎస్ఎంవీటీలో నిలిచి ఖాళీగా ఉన్న కారైకల్ ఎక్స్ప్రెస్లోని జనరల్ బోగిలోకి ఎక్కిన అతడు ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.
మరోవైపు వ్యక్తి మృతదేహం ఉన్న కంపార్ట్మెంట్ను ఆ రైలు నుంచి వేరు చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో సుమారు నాలుగు గంటలు ఆలస్యంగా ఆ రైలు స్టేషన్ నుంచి బయలుదేరింది. రైల్వే పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.