తిరువనంతపురం: కేరళలోని అధికార సీపీఎం నేత కుమార్తె అనుపమ, తన భర్తతో కలిసి ఆ రాష్ట్ర సచివాలయం వద్ద శనివారం బైఠాయించి నిరసనకు దిగింది. ఆరు నెలల కిందట తాను జన్మనిచ్చిన మూడు రోజుల మగ బిడ్డను తన తండ్రి బలవంతంగా తీసుకెళ్లి దత్తత కేంద్రానికి అప్పగించాడని ఆమె ఆరోపించింది. దీనిపై పోలీస్ స్టేషన్, పోలీస్ ఉన్నతాధికారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, పిల్లల సంక్షేమ మండలిని కలిసి ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరుగలేదన్నారు. తన తండ్రి కీలక వ్యక్తి కావడమే దీనికి కారణమని ఆమె ఆరోపించారు.
‘నేను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా లేదా ఏ పార్టీ బ్యానర్ కింద నిరసన చేయడం లేదు. మా హక్కుల కోసం నా భర్త, నేను ఇక్కడ ఉన్నాము. మాకు స్థానిక పోలీసు స్టేషన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, పిల్లల సంక్షేమ మండలి నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. కాబట్టి న్యాయం కోసం మేం నిరసన తెలుపుతున్నాం’ అని అనుపమ అన్నారు. తమ బిడ్డను అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు.
కాగా, కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ దీనిపై స్పందించారు. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని మహిళా, శిశు అభివృద్ధి శాఖను ఆదేశించారు.