తిరువనంతపురం: కేరళ కాంగ్రెస్ పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు. సీనియర్ నాయకుడు, కేరళ పీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ కేపీ అనిల్ కుమార్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, కేరళ పీసీసీ చీఫ్కు పంపినట్లు అనిల్ కుమార్ తెలిపారు. తాను గత 43 ఏండ్లుగా పార్టీ కోసం పనిచేశానని, కానీ ఇప్పటి నూతన నాయకత్వం తనను వెన్నుపోటు పొడిచిందని ఆయన ఆరోపించారు.
పార్టీలో బొత్తిగా ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, తనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం మీడియాలో వచ్చేవరకు కూడా తనకు తెలియదని అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం తాను సీపీఎం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కాగా, ఇటీవల ఏఐసీసీ చేసిన కేరళ జిల్లా అధ్యక్షుల ఎంపికపై అనిల్కుమార్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తంచేశారు. దాంతో ఆగస్టు 29న పార్టీ ఆయనను బహిష్కరించింది. తాజాగా అనిల్ కుమార్ రాజీనామా ప్రకటనపై కూడా రాష్ట్ర కాంగ్రెస్ స్పందించింది. ఆయనను తాము ఎప్పుడో పార్టీ నుంచి తీసేశామని ప్రకటించింది.