తిరువనంతపురం, జూన్ 20: కేరలోని ఆలయంలో కార్యకర్తలకు ఆయుధ శిక్షణను ఇస్తున్న ఆరెస్సెస్కు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ పీజీ అజిత్కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు మంగళవారం నోటీసులు ఇచ్చింది. ఈ అంశంపై స్పందనను తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.
తిరువనంతపురంలోని సర్కార దేవి ఆలయంలో ఆరెస్సెస్ కార్యకర్తలకు ఆయుధ శిక్షణను ఇస్తూ భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారంటూ ఇద్దరు భక్తులు, ఓ స్థానికుడు హైకోర్టును ఆశ్రయించారు. డ్రిల్స్ నిర్వహిస్తూ పెద్దగా శబ్దాలు చేస్తూ నినాదాలు చేస్తున్నారని వారు పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆరెస్సెస్కు నోటీసులు జారీ చేసింది. ఆలయ పరిసరాల్లో ఆయుధ శిక్షణను ఇస్తుండడంతో మహిళలు, చిన్నారులు దర్శనానికి వెళ్లేందుకు జంకుతున్నట్టు పిటిషనర్లు తెలిపారు. ఆరెస్సెస్ కార్యకర్తలు ఆలయ పరిసరాల్లోనే పొగ తాగుతూ, పాన్మసాలా తింటున్నారని వారు ఆరోపించారు.