కొచ్చి : కేరళలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. ప్రతి కేసునూ గుర్తించేందుకు తాము పెద్ద ఎత్తున టెస్టింగ్ చేపడుతున్నామని, వైరస్ కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. కేరళలో కొవిడ్-19 కేసుల పెరుగుదలతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ కేరళ సీఎం పినరాయి విజయన్తో ఇటీవల సమావేశమయ్యారు.
యాక్టివ్ కేసులు పేరుకుపోతుండటంతో వైరస్ నియంత్రణకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకునేందుకు కేరళకు కేంద్రం రూ 267.35 కోట్లు సమకూర్చింది. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో జరిగిన భేటీలో వీణా జార్జ్ కూడా పాల్గొన్నారు. సెప్టెంబర్ మాసాంతానికి కేరళకు 1.1 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయాలని కోరగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అంగీకరించారని ఆమె తెలిపారు.