JP Nadda on Kerala | ఇస్లామిక్ టెర్రరిజం వృద్ధికి కేరళ కేంద్రంగా మారుతుందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వం ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సీపీఎం సర్కార్ పోషిస్తున్నదని సంచలన ఆరోపణ చేశారు. శుక్రవారం కోజికోడ్లో జరిగిన సభలో మాట్లాడుతూ ప్రతి సామాజిక వర్గాన్ని సమానంగా చూస్తామన్న ముద్రతో సీపీఎం సారధ్యంలోని ఎల్డీఎఫ్ సర్కార్ పని చేస్తుందన్నారు. కానీ కుహానా లౌకిక వాదం పేరుతో ఒక వర్గానికే ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ఇతర సెక్షన్లను విభజించడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
గత 15 ఏండ్లలో రాష్ట్రంలో హింస పెరిగిపోయిందని పరోక్షంగా రాజకీయ హత్యలు జరిగాయన్నారు. 2016లో 55 రాజకీయ హత్యలు జరిగితే, కేరళ సీఎం పినరాయి విజయన్ సొంత జిల్లా కన్నూర్లో 12 హత్యలు జరిగాయన్నారు. గత మూడేండ్లలో కేరళలో 1019 హత్యలు జరిగాయని చెప్పారు. కేరళలో శాంతి భద్రతలే లేవని అన్నారు. పూర్తిగా అవినీతి విధానాలు అమలవుతున్నాయని తెలిపారు.