తిరువనంతపురం, నవంబర్ 9: కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి పలువిధాలుగా మోకాలడ్డుతున్న గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ఖాన్కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సీఎం విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీ హోదాలో ఉన్న ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో ప్రముఖ విద్యావేత్తలను నియమించేలా ఆర్డినెన్స్ తేవాలనుకొంటున్నది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో విజయన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. వైస్ చాన్స్లర్ల నియామకం, విశ్వవిద్యాలయాల పనితీరుకు సంబంధించి గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఉన్నత విద్య మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు. ఈ ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘రాజ్యాంగబద్ధమైన విధులకు అనుగుణంగా ఆయన నడుచుకుంటారని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
వీసీల రాజీనామా ఎపిసోడ్
ఇటీవల వీసీ నియామకానికి సంబంధించిన విషయంలో కేరళలో పెద్ద ఎపిసోడ్ నడిచింది. ఓ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ తొమ్మిది యూనివర్సిటీలకు చెందిన వీసీలు రాజీనామాలు చేయాలని గవర్నర్ గత నెలలో ఆదేశించారు. వీసీలు తిరస్కరించడంతో గవర్నర్ షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ వీసీలు హైకోర్టులో రిట్ పిటిషన్లు వేశారు. పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టేంత వరకు షోకాజ్ నోటీసులపై తుది ఉత్తర్వులు జారీచేయొద్దని న్యాయస్థానం తాజాగా మంగళవారం గవర్నర్కు సూచనలు చేసింది.