తిరువనంతపురం: వృద్ధులు, వికలాంగుల వంటి సమాజంలోని బలహీన వర్గాలకు ఇచ్చే సామాజిక భద్రత పింఛన్ను (Pensions) ప్రభుత్వ అధికారులు పొందుతున్నారు. వారికి వచ్చే జీతంతోపాటు సర్కారు నుంచి వచ్చే రూ.1600 కూడా అక్రమంగా అందుకుంటున్నారు. కేరళలలో 1498 మంది ప్రభుత్వ ఉద్యోగులు సామాజిక పెన్షన్ అందుకుటున్నట్లు గుర్తించారు. వారిలో గెజిటెడ్ అధికారులు, కాలేజీ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. అర్హులైన వారికి మాత్రమే పింఛను అందేలా చూడాలని ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ఇన్ఫర్మేషన్ కేరళ మిషన్ నిర్వహించిన ఆడిట్లో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చెందిన దాదాపు 62 లక్షల మందికి నెలవారీ పెన్షన్గా రూ.1,600 అందిస్తున్నది.
కాగా, అక్రమాల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్ పొందిన ఉద్యోగుల నుంచి వడ్డీతో సహా వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ఆదేశించారు. అనర్హులను గుర్తించేందుకు తదుపరి పరిశీలన కొనసాగుతుందని వెల్లడించారు. సంక్షేమ వ్యవస్థ సమగ్రతను కాపాడుతూ అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి మోసాలను వెలికితీసేందుకు వివిధ స్థాయిల్లో తనిఖీలను ఇకపై కొనసాగిస్తామని చెప్పారు.