కేరళ గవర్నర్కు, ప్రభుత్వానికి మధ్య వ్యవహారం మరింత ముదురుతోంది. తాను ఎవ్వరికీ జవాబుదారీ కానని, కేవలం రాష్ట్రపతికి మాత్రమే జవాబుదారినని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తేల్చి చెప్పారు. రాజ్భవన్ వ్యవహారాల్లో ఎవరైనా వేలు పెట్టాలని చూస్తే.. అసాధారణమైన రాజ్యాంగ సంక్షోభానికే దారితీస్తుందని గవర్నర్ తీవ్రంగా హెచ్చరించారు. ఇక.. తన సిబ్బంది నియామకంపై కూడా గవర్నర్ వివరణ ఇచ్చారు.
‘మంత్రుల వ్యక్తిగత సిబ్బంది పెన్షన్ తీసుకునే విధానం ఒక్క కేరళలోనే చూస్తున్నా. నేను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో నాకు 11 మంది మాత్రమే వ్యక్తిగత సిబ్బంది వుండేవారు. ఇక్కడ మాత్రం ఒక్కో మంత్రికి 20 మంది చొప్పున వ్యక్తిగత సిబ్బంది ఉంటున్నారు. వారిలో అధిక శాతం రాజకీయ కార్యకర్తలే’ అంటూ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఇక ప్రతిపక్ష నేత వీడీ సతీశన్పై కూడా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీవ్రంగా మండిపడ్డారు. సీనియర్ కాంగ్రెస్ నేతలైన ఊమెన్ చాందీ, రమేశ్ చెన్నితలను చూసి రాజకీయాలు నేర్చుకోవాలని చురకలంటించారు. ఇక… మాజీ మంత్రి బాలన్.. ఇంకా చిన్న పిల్లల దశ నుంచి బయటకు రావడం లేదని గవర్నర్ ఎద్దేవా చేశారు.