Kerala | తిరువనంతపురం : కేరళ వయనాడ్ జిల్లాలో మనుషులను చంపి అలజడి సృష్టించిన పెద్ద పులి ని చంపేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ పులి మగ పులి అటవీ శాఖ మంత్రి ఏకే సశేంద్రన్ వెల్లడించారు. 13 ఏండ్ల వయసు గల ఆ మగ పులిని చంపేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పులిని చంపేందుకు ప్రత్యేక బృందాలు గ్రౌండ్లో ఉన్నాయని పేర్కొన్నారు. పులిని పట్టుకోవడానికి సాధ్యంకాని పక్షంలో దానిని చంపాలన్న ప్రభుత్వ ఆదేశాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కేరళ హైకోర్టు కొట్టివేసినట్లు అటవీ శాఖ మంత్రి స్పష్టం చేశారు.
ఈ నెల 9వ తేదీన పులి దాడిలో మృతి చెందిన వ్యక్తి కేరళలోని వయనాడ్కు చెందిన 36 ఏళ్ల ప్రజీశ్గా గుర్తించారు. ప్రజీశ్ గడ్డి కోయడానికి వెళ్లిన సమయంలో పులి అతనిపై ఒక్కసారిగా దాడి చేసింది. అతని శరీరంలో కొంతభాగాన్ని తినేసింది. ఆ ఘటన స్థానికంగా తీవ్ర అలజడి రేపింది.
ఈ ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సమస్యను పరిష్కారంపై హామీ ఇచ్చే వరకు మృత దేహాన్ని అక్కడి నుంచి తరలించేది లేదని పట్టుబట్టారు. ఈ క్రమంలోనే కేరళ అటవీ శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పులిని అంతమొందించాలని ఆదేశాల్లో పేర్కొంది.
అయితే, చంపడానికి ముందు అది మ్యాన్ ఈటర్ అవునా..? కాదా..? అనేది ధ్రువీకరించుకోవాలని సూచించింది. టార్గెట్ చేసిన పులి మ్యాన్ ఈటర్ అని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని బంధించలేకపోతే చంపేయాలని పేర్కొన్నది. దాంతో పులి జాడ గుర్తించేందుకు అటవీ శాఖ 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది.