అలప్పుజా (కేరళ), జనవరి 30: బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సభ్యులైన 15 మందికి కేరళ కోర్టు ఉరిశిక్ష విధించింది. దోషులు అందరూ ‘శిక్షణ పొందిన కిల్లర్ స్వాడ్’ అని, కన్నతల్లి, భార్య బిడ్డల ఎదుటే బాధితుడిని క్రూరంగా చంపడం అత్యంత అరుదైన నేరాల పరిధిలోకి వస్తుందని కోర్టు వ్యాఖ్యనించింది. కేరళ చరిత్రలో ఒకేసారి ఇంతమంది దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించడం సంచలనంగా మారింది. బీజేపీ ఓబీసీ మోర్చా కేరళ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసన్ను అలప్పుజా జిల్లాలోని తన నివాసంలోనే 2021 డిసెంబర్ 19న కుటుంబసభ్యుల కండ్ల ఎదుటనే అత్యంత దారుణంగా చంపేశారు.
ఈ హత్య ఘటనలో పీఎఫ్ఐతోపాటు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన కార్యకర్తలు పాలుపంచుకున్నారు. కోర్టులో నేరం రుజువు కావడంతో దోషులైన 15 మందికి మరణ శిక్ష విధిస్తూ మవెలిక్కర అదనపు జిల్లా జడ్జి వీజీ శ్రీదేవి మంగళవారం తీర్పు వెలువరించారు. దోషుల్లో నైసమ్, అజ్మల్, అనూప్, అస్లమ్, అబ్దుల్ కలామ్, సలామ్, సఫారుద్దిన్, మన్సద్, జసీబ్ రాజా, నవాస్, సమీర్, నాజిర్, జాకీర్ హుస్సేన్, షాజీ పూవతుంగల్, షేర్నాస్ అష్రఫ్ ఉన్నారు. తొలి ఎనిమిది మంది దోషులు హత్య ఘటనలో నేరుగా పాలుపంచుకోగా, మిగతా వారు హతుడి ఇంటి ఎదుట ఆయుధాలతో నిఘా పెట్టారు.