VD Satheesan : కేరళలో యూడీఎఫ్ ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. సోమవారమే వీడీ సతీషన్ సీఎంగా ప్రభుత్వం కొలువుదీరనుంది. ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఇదే సమయంలో మంత్రివర్గ కూర్పు కూడా పూర్తైంది. కేరళలో ఆరు దశాబ్దాల తర్వాత ఒకేసారి పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు కానుంది. మొత్తం 21 మంది మంత్రివర్గంలో చేరనున్నారు.
తనతోపాటు మంత్రులుగా మరో 20 మంది ప్రమాణం చేస్తారని గవర్నర్కు వీడీ సతీషన్ తెలిపారు. మంత్రులుగా ఎంపికైన వారి పేర్ల జాబితాను కూడా గవర్నర్కు అందించారు. సామాజిక, ప్రాంతీయ సమతుల్యత పాటిస్తూ మంత్రివర్గాన్ని ఎంచుకున్నట్లు సతీషన్ తెలిపారు. కొంతమంది అర్హులైన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోతున్నట్లు చెప్పారు. కూటమి నేతలతో చర్చించాకే మంత్రి పదవుల కేటాయింపు జరిగిందని సతీషన్ అన్నారు. యూడీఎఫ్ కూటమిలోని ఐయూఎంఎల్ పార్టీకి ఐదు మంత్రి పదవులు కేటాయించినట్లు వెల్లడించారు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేతల్లో ఇటీవలి సీఎం అభ్యర్థి రమేష్ చెన్నితల కూడా ఉన్నారు. ఆయన మొదట మంత్రివర్గంలో చేరేందుకు నిరాకరించినప్పటికీ.. చివరకు మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆయనతోపాటు కే మురళీధరన్, కేరళ పీసీసీ చీఫ్ సన్నీ జోసెఫ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేస్తారు. వీరితోపాటు బిందు కృష్ణ, ఏపీ అనిల్ కుమార్, పీసీ విష్ణునాథ్, ఎం లిజు, రోజి ఎం జాన్, టీ సిద్ధిఖ్, ఓజే జనీష్, కేఏ తులసి కాంగ్రెస్ నుంచి మంత్రులుగా ఎంపికకాగా.. ఐఎంయూఎల్ నుంచి పీకే కున్హాలికుట్టి, పీకే బషీర్, ఎన్ షంశుద్దీన్, కేఎం షాజి, వీఈ అబ్దుల్ గఫూర్ మంత్రి పదవులు చేపట్టనున్నారు.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 140 సీట్లకుగాను యూడీఎఫ్కు 102 సీట్లు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ 63 సీట్లు దక్కించుకుంది.