Rahul Gandhi | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే. నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేరళకు చెందిన ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆభా మురళీధరన్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం.. అనర్హత ‘ఏకపక్షం’, ‘చట్టవిరుద్ధం’ అయినందుకు రాజ్యాంగానికి తీవ్ర వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. ఎన్నికైన శాసన సభలకు చెందిన ప్రజా ప్రతినిధులపై ఆటోమేటిక్గా అనర్హత వేటు వేయడం ‘ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం’ అని.. తమ తమ నియోజకవర్గాల ఓటర్లు తమపై విధించిన విధులను స్వేచ్ఛగా నిర్వర్తించకుండా వారిని అడ్డుకోవడమేనని పిటిషన్లో పేర్కొన్నారు. సభ్యుడికి వ్యతిరేకంగా ఆరోపించబడిన నేరాల స్వభావం, తీవ్రతతో సంబంధం లేకుండా అనర్హత విధించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు.
సెక్షన్ 8(3), 1951 చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 8A, 9, 9A, 10, 10A, 11లోని సబ్-సెక్షన్ (1)కి విరుద్ధంగా ఉందని, 1951 చట్టంలోని అధ్యాయం III ప్రకారం.. అనర్హత వేటును పరిగణనలోకి తీసుకునేటప్పుడు నేర స్వభావం, నిందితుల పాత్ర, నైతిక విషయాలు తదితర అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆభా మురళీధరన్ పిటిషన్లో పేర్కొన్నారు. క్రూరమైన నేరాలకు పాల్పడి కోర్టుల ద్వారా శిక్షిపడిన ఎంపీ, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడమే చట్టం అసలు ఉద్దేశమన్నారు.