న్యూఢిల్లీ : ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి నేపధ్యంలో కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయిన వారికి బూస్టర్ డోసులను అనుమతించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఇప్పటివరకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి పెరిగింది. ఇక కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయిన నమూనాలు అన్నింటినీ జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపుతున్నామని కేజ్రీవాల్ తెలిపారు.
వైరస్ వ్యాప్తి విస్తృతమవుతున్న క్రమంలో ఉచిత రేషన్ పధకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించేందుకు క్యాబినెట్ సమావేశం నిర్ణయించిందని వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్పై ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఆస్పత్రుల్లో మౌలిక వసతులను సిద్ధం చేశామని చెప్పారు. తాజా కోవిడ్-19 కేసుల్లో చాలావరకూ ఆస్పత్రిలో చేరే పరిస్ధితి ఉండబోదని తెలిపారు.
హోం ఐసోలేషన్ వ్యవస్ధను బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ దిశగా ఈనెల 23న సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. వైరస్ను కట్టడి చేసేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలతో మెలగాలని, మాస్క్లు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. ఢిల్లీలోకి ట్రక్కుల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేస్తున్నామని ఢిల్లీ సీఎం ప్రకటించారు.