చండీఘఢ్ : పంజాబ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తాము గెలుపొందితే 23 కార్యక్రమాలు చేపడతామని ఆప్ ఇప్పటికే ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయగా తాజాగా మరికొన్ని హామీలు గుప్పించింది. మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే చండీఘఢ్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
తాము అధికారంలోకి వస్తే అవినీతికి చరమగీతం పాడుతూ ఇంటిముందుకే అన్ని సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. చండీఘఢ్లోని దసరా గ్రౌండ్లో జరిగిన సభలో మాట్లాడుతూ పలు వరాలు కురిపించారు.
ఢిల్లీ తరహాలో చండీఘఢ్లోనూ ఉచిత విద్యుత్, మంచినీరు అందిస్తామని, పేరుకుపోయిన చెత్తను తొలగిస్తామని, సొసైటీల్లో అభివృద్ధి పనులను మున్సిపాలిటీ పర్యవేక్షించేలా చర్యలు చేపడతామని చెప్పారు. మహిళల భద్రత కోసం సీసీటీలు, స్ట్రీట్లైట్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా డిసెంబర్ 24న మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా ఈనెల 27న ఫలితాలు ప్రకటించనున్నారు.