న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: లిక్కర్ స్కామ్ అంటూ విపక్షాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులతో వేధింపులకు గురి చేస్తున్న కేంద్రంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు లిక్కర్ స్కామ్ ఏమిటో అర్థం కావటం లేదని అన్నారు. ఈ వేధింపులకు పాల్పడే బదులు దేశానికి ఏదైనా మంచి చేయొచ్చు కదా! అని మోదీ సర్కారుకు చురకలు అంటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘ఒక బీజేపీ నేత 1.5 లక్షల కోట్ల స్కామ్ అంటారు, ఇంకొకరు రూ.8 వేల కోట్ల స్కామ్ అంటారు, వేరొకరు రూ.1,100 కోట్ల స్కామ్ అంటారు, ఇక.. లెఫ్ట్నెంట్ జనరల్ రూ.144 కోట్ల కుంభకోణం అని, సీబీఐ రూ.1 కోటి స్కామ్ అని ఆరోపిస్తారు. ఢిల్లీ బడ్జెట్ మొత్తం రూ.70 వేల కోట్లు అయితే, రూ.1.5 లక్షల కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుంది?’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
లిక్కర్ స్కామ్ అంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తే ఒక్క ఆధారం కూడా దొరకలేదని, అలాంటప్పుడు స్కామ్ ఎక్కడ ఉన్నట్టు? అని అడిగారు. ‘పగలు, రాత్రి అన్న తేడా లేకుండా సీబీఐ, ఈడీలతో సోదాలు చేయించే బదులు దేశానికేదైనా మంచి చేయొచ్చు. కానీ కేంద్రం అలాంటిదేమీ చేయలేదు. అందుకే దర్యాప్తు సంస్థలతో అందర్నీ భయపెడుతున్నది’ అని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు దేశ పురోగతికి విఘాతమని పేర్కొన్నారు. కాగా, ఈడీ శుక్రవారం దేశవ్యాప్తంగా 40 చోట్ల సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ వ్యాపారులతో సంబంధం ఉన్నవారు, డిస్ట్రిబ్యూటర్ల ఇండ్లలో దాడులు చేసింది. హవాలా కేసులో మే 30న అరెస్టయిన ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ను కూడా తీహార్ జైలులో ప్రశ్నించింది.