న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాజకీయాలను పక్కనపెట్టి దేశ రాజధానిలో శాంతి భద్రతల పరిస్ధితిపై దృష్టి సారించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ను ఓ వ్యక్తి వేధింపులకు గురిచేసి కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపిన నేపధ్యంలో ఎల్జీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు.
ఢిల్లీలో శాంతి భద్రతల పరిస్ధితి ఎలా ఉందని ప్రశ్నించిన కేజ్రీవాల్ గూండాల నైతిక స్థైర్యం పెరిగి చివరికి మహిళా కమిషన్ చైర్పర్సన్కే భద్రత లేని పరిస్ధితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్జీ సాబ్ కొద్దిరోజులు రాజకీయాలను పక్కనపెట్టి నగరంలో శాంతి భద్రతలపై దృష్టిసారించాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
శాంతి భద్రతల పర్యవేక్షణలో తాము ఆయనకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ను గురువారం తెల్లవారుజామున తప్పతాగిన కారు డ్రైవర్ వేధిస్తూ ఆమె చేయి కారు విండోలో చిక్కుకుపోవడంతో 15 మీటర్ల దూరం ఈడ్చుకువెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో డ్రైవర్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అతడి కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.