న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాలనాపరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. సేవల కార్యదర్శి ఆశిష్ మోర్ను తొలగించారు. అలాగే పరిపాలనలో పునర్వ్యవస్థీకరణ చేపడతామని స్పష్టం చేశారు. ప్రజా పనులకు అడ్డంకిగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సక్రమంగా పని చేయని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అధికారుల బదిలీ, పోస్టింగ్ అధికారం ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటుందన్నారు. ఎన్నికైన ప్రభుత్వం ద్వారా మాత్రమే అధికారులు పని చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ విషయం స్పష్టమైందని, ప్రజాస్వామ్యం మరోసారి గెలిచిందని పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీ పాలనా వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. 2019 నాటి సింగిల్ జడ్జీ తీర్పును తోసిపుచ్చింది. అన్ని రాష్ట్రాల తరహాలోనే ఢిల్లీలో పాలన ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం ల్యాండ్, పోలీస్, లాపై అధికారం మాత్రమే కేంద్రానికి ఉంటుందని తెలిపింది. మిగిలిన అన్ని అంశాలపై శాసనాధికారం కేజ్రీవాల్ సర్కార్కు ఉంటుందని కోర్టు పేర్కొంది. అధికారులపై నియంత్రణ, వారి నియామకాలు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్తోసహా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.