న్యూఢిల్లీ: వాయు కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ సర్కార్ ఈ ఏడాది కూడా కొత్త ప్రణాళికలు అమలు చేయనున్నది. వాహనాలు ఉన్న వ్యక్తులు వారంలో ఒకసారి తమ వెహికిల్ను బయటకు తీయవద్దు అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడంలో ఇదో ప్రయత్నం అవుతుందన్నారు. స్వంత వాహనాన్ని బయటకు తీయకుండా.. మెట్రోలోనో, బస్సులోనో లేదా ఇతరుల వాహనాన్ని షేర్ చేసుకుని ఆఫీసుకు వెళ్లాలని కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా చేయడం వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చు అని, అలాగే ఇంధన కూడా ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.
గత ఏడాది రెడ్లైట్ ఆన్.. గాఢీ ఆఫ్ అన్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేశామని, అక్టోబర్ 18వ తేదీ నుంచి ఇది మళ్లీ ప్రారంభం అవుతుందని, రెడ్ సిగ్నల్ పడినప్పుడు, మీరు మీ వాహన ఇంజిన్ ఆఫ్ చేయాలని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. గ్రీన్ ఢిల్లీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఢిల్లీలో ఎక్కడైనా కాలుష్యం కనిపిస్తే వెంటనే ఈ యాప్లో ఫిర్యాదు చేయాలన్నారు. ఆ స్పాట్కు తమ టీమ్ వెళ్లి తక్షణమే కాలుష్య నియంత్రణ చేపడుతుందని సీఎం తెలిపారు.