లక్నో: రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ కొత్త వ్యూహాన్ని అమలులోకి తెచ్చింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు డ్రైవర్లు తమ ఫ్యామిలీ ఫొటోను డాష్బోర్డ్ వద్ద ఉంచాలని ఆ రాష్ట్ర రవాణా కమిషనర్ చంద్ర భూషణ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. (UP Bus Drivers) డ్రైవర్ ముందు కుటుంబం ఫొటో ఉండటం వల్ల రోడ్డు భద్రత పట్ల అప్రమత్తత, భావోద్వేగాన్ని పెంచుతుందని తెలిపారు. ‘డ్రైవర్లకు వారి కుటుంబాలను ఫ్యామిలీ ఫొటో గుర్తు చేస్తుంది. సురక్షితమైన డ్రైవింగ్కు వారిని ప్రోత్సహిస్తుంది’ అని ఆ అధికారి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఈ విధానాన్ని ఆచరించడం వల్ల ఆ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గాయని అన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలు 4.7 శాతం పెరిగాయని ఆ రాష్ట్ర రవాణా శాఖ తెలిపింది. 2022లో 22,596గా ఉన్న రోడ్డు ప్రమాదాల సంఖ్య 2023లో 23,652కు పెరిగినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వినూత్న పరిష్కారాలను అన్వేషిస్తున్నట్లు ఆ రాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.