న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కనీసం 48 గంటల మెడికల్ ఆక్సిజన్ను బఫర్ స్టాక్లో ఉంచాలని ఆదేశించింది. దీంతో పాటు మెడికల్ ఆక్సిజన్ కంట్రోల్ రూములను సైతం మళ్లీ పటిష్టం చేయాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు తెలిపింది. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆక్సిజన్ తగినంత లభ్యత ఉండేలా చూడాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు.
రాష్ట్రాలు తమ వద్ద ఉన్న ఆక్సిజన్, సౌకర్యాలను అంచనా వేయాలని సూచించారు. ప్రైవేటు సంస్థల్లోనూ సామర్థ్యాన్ని అంచనా వేసి, డిమాండ్ పెరిగిన సమయంలో సరఫరా పెంచేందుకు వ్యూహాన్ని రూపొందించాలన్నారు. ఆసుపత్రుల్లోని ఎల్ఎంఓ ట్యాంకులను నింపాలని, రీఫిల్లింగ్కు అంతరాయం లేకుండా సరఫరా చైన్ ఉండేలా చూడాలన్నారు. దేశవ్యాప్తంగా పీఎస్ఏ ప్లాంట్లతో ఆసుపత్రులు బలోపేతం అయ్యాయని, ఈ ప్లాంట్లు పూర్తి స్థాయిలో పనిచేయడం అవసరమన్నారు. అన్ని జిల్లాలు కూడా వెంటిలేటర్లు, బైపెప్, ఎస్పీఓ2 (SPO2) సిస్టమ్స్తో సహా ప్రాణాలను రక్షించే పరికరాలు ఆసుపత్రుల్లో అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.