Kazakhstan | అమాంతం పెరిగిన పెట్రో ధరలను నిరసిస్తూ కజకిస్తాన్లో ప్రజలు భారీ ఆందోళనలు చేపట్టారు. పెట్రో ధరలను నిరసిస్తూ వీధుల్లో నిరసనలకు దిగారు. ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. ఈ నిరసన కాస్తా… రాజకీయ రూపం పులుముకుంది. ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ప్రెసిడెంట్ జోమార్ట్ టోకయేవ్ ఆమోదించారు కూడా. ఈ మేరకు ప్రెసిడెంట్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు పెట్రో ధరలను నిరసిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటి వరకూ ఆందోళనలు తగ్గడం లేదని సమాచారం.
అల్మాతి నగరంలో ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొరబడి నిప్పుపెట్టడానికి ప్రయత్నించారని స్థానిక మీడియా పేర్కొంది. దీంతో పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారని, ఫైరింగ్ చేశారని మీడియా తెలిపింది. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ 1991 తర్వాత దేశంలో ఇంత పెద్ద మొత్తంలో అల్లర్లు జరిగాయని, పెట్రో ధరలను నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనలను కొందరు హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే ఎంతకీ ఆందోళనలు అదుపులోకి రాకపోవడంతో తాము ఫైరింగ్ ప్రారంభించామని, ఇందులో 12 మంది చనిపోయారని, వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యామని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.
కజకిస్తాన్లో జరుగుతున్న నిరసనలను దృష్టిలో పెట్టుకొని రష్యా యాక్టివ్ అయ్యింది. కజకిస్తాన్కు భారీ సంఖ్యలో తమ బలగాలను పంపింది. ఇక.. కజకిస్తాన్ ప్రెసిడెంట్ టోకయేవ్ కలెక్టివ్ ట్రీటీ ఆర్గనైజేషన్ (సీఎస్టీవో) మద్దతు కోరారు. ఈ ఆందోళన కారులకు ఇతర దేశాల నుంచి ఆర్థికంగా మద్దతు లభిస్తోందని ప్రెసిడెంట్ ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆందోళనలు ఎంతకీ తగ్గకపోవడంతో స్థానికంగా ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు. రెండు వారాల పాటు ఎమర్జెన్సీని విధించారు.