న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో విద్యుత్తు సంక్షోభం నెలకొన్నది. ముఖ్యంగా కశ్మీర్లో రోజుకు 16 గంటలపాటు కరెంట్ కోతలు విధిస్తున్నారు. వాస్తవానికి రోజుకు 16 గంటల కరెంట్ సైప్లె చేయాలంటే 1800 మెగావాట్ల విద్యుత్తు అవసరం. కానీ ప్రస్తుతం రోజుకు 50-100 మెగావాట్ల కరెంట్ మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. దీంతో కశ్మీర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు దశాబ్దాలలో ఇంత ఎక్కువ సమయం కరెంట్ కోతలు విధించడం ఇదే తొలిసారి అని స్థానికులు చెప్పారు. సమస్యపై లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం స్పందిస్తూ కమిటీని ఏర్పాటు చేసి విద్యుత్తు కొనుగోలు చేస్తామని వెల్లడించింది. రాజకీయ నాయకులు మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకొన్న ప్రభుత్వం ఉంటే కరెంట్ సమస్య వచ్చేది కాదన్నారు.