న్యూఢిల్లీ, జూలై 10: హిమ తుషారాలలో రేగిన నిప్పు కణిక సెగ హస్తినను తాకింది. లోయ నుంచి తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కశ్మీర్లో రెండు నెలలుగా నిరసన దీక్ష చేపడుతున్న కశ్మీరీ పండిట్లు ఢిల్లీలో తమ ఆందోళనను ఉధృతం చేశారు. కేంద్రప్రభుత్వ ఏకపక్ష విధానాలను ఎండగడుతూ జంతర్మంతర్ వేదికగా ఆదివారం నిరసనను కొనసాగించారు. ప్రభుత్వ అసమర్థత కారణంగా ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పండిట్ ఉద్యోగులు రాహుల్ భట్, రజినీ బాలా కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోయ నుంచి తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
బలిపశువులుగా చేస్తున్నారు
లోయలో నివసిస్తున్న కశ్మీరీ పండిట్లు దినదినగండంగా బతుకుతున్నారు. చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయ్. స్వార్థ ప్రయోజనాలకు సర్కార్ మమ్మల్ని బలిపశువులను చేస్తున్నది.
–రాజన్ పండిట్, ఉద్యోగి