శ్రీనగర్, నవంబర్ 26: కశ్మీర్ లోయలో తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కశ్మీరీ పండిట్లు డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు హత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో శనివారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పండిట్లు చెప్పులు లేకుండా భారీ నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వీధుల్లో భారీ ర్యాలీ తీశారు. తమ భద్రతను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ప్రాణాలకు నిరంతర ముప్పు పొంచి ఉందని, బెదిరింపులు పరిపాటిగా మారిపోయాయని తెలిపారు. కశ్మీర్ లోయను వదిలివెళ్లడం తప్ప దీనికి వేరే పరిష్కారం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. కశ్మీరీ పండిట్ ఉద్యోగుల జీతాలను నిలిపివేసే హక్కు ఎవరిచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.