శ్రీనగర్/జమ్ము, అక్టోబర్ 15: కశ్మీర్ లోయలో మరో పండిట్ దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లా చౌదరి గుండ్లో తన ఇంట్లో పూరన్ కృష్ణణ్ భట్ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఉగ్రసంస్థ కశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్ గ్రూప్ ఈ దారుణానికి పాల్పడినట్టు డీఐజీ సుజిత్ కుమార్ మీడియాతో తెలిపారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టామని, ఆ ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ చేపట్టామని వెల్లడించారు. ప్రాథమిక విచారణలో ఒక ఉగ్రవాది భట్ను కాల్చినట్టు తెలిసిందని, బాధితుడిని దవాఖానకు తరలించే లోపే ప్రాణాలు విడిచాడని వివరించారు. ఘటనను ఎల్జీ మనోజ్ సిన్హా, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నేతలు ఖండించారు.
కట్టలు తెంచుకొన్న పండిట్ల ఆగ్రహం
పూరణ్ దారుణ హత్యపై అక్కడి పండిట్ల ఆగ్రహం కట్టలు తెంచుకొన్నది. వందల మంది పండిట్ ఉద్యోగులు జమ్ము-అక్నూర్ రోడ్డును బ్లాక్ చేసి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే తమను కశ్మీర్ లోయ నుంచి తరలించి, వేరే చోటున నివాసం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత మే లో రాహుల్ భట్ అనే ఉద్యోగిని ఉగ్రవాదులు కాల్చి చంపినప్పటి నుంచి అక్కడి పండిట్ ఉద్యోగులు తమను వేరే చోటుకు తరలించాలని కోరుతున్నారు. ఐదు నెలలుగా కేంద్రంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, మరో పండిట్ హత్యతో వారు రోడ్డెక్కాల్సి వచ్చింది. తమకు భద్రత కల్పించటంలో కేంద్ర ప్రభు త్వం విఫలమైందని పండిట్లు మండిపడ్డారు. ఉగ్రవాదుల చేతుల్లో మరణించే ఒక్కో వ్యక్తి మృతికి మోదీ సర్కారే కారణమని విమర్శించారు. కేంద్రం చేతగానితనం వల్లే ఈ హత్యలను చూడాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం చెవిటి, మూగ, గుడ్డిదైందని బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. కాగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకపోవడంపై కేంద్రం మీద భట్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది.
అధికారులపై నెపం
పండింట్ హత్యపై కేంద్రం మీద తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో నెపాన్ని అధికారులపైకి నెట్టేందుకు బీజేపీ యత్నించింది. ఈ ఘటన నుంచి పాఠం నేర్చుకోవాలని, లోయలో పనిచేయాలని పండిట్లపై ఒత్తిడి తేవొద్దని అధికారులకు సూచించింది.