న్యూఢిల్లీ, జూన్ 8: కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులు 1990ల నాటి దుస్థితిని తలపిస్తున్నాయని కశ్మీరీ పండిట్లు అంటున్నారు. ‘కశ్మీర్ మాది. మా పూర్వీకులు ఇక్కడే బతికారు. కశ్మీర్లో భద్రత ఉంటుందంటే ఇక్కడికి ఎంతో ఆశతో వచ్చాం. కానీ, వెనక్కు తిరిగి రావాలని మాకు హామీ ఇచ్చినవారు ఇప్పుడు మౌనంగా ఉన్నారు’ అని కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శిస్తున్నారు. బయటకు వెళ్లే తిరిగి ఇంటికి వస్తామో లేదో తెలియన భయంకర పరిస్థితులు ఉన్నాయని వాపోయారు.
‘ఆఫీసులు మూసేశారు. నిత్యావసరాలు, మందులు కొనుక్కోవడానికి కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి. పిల్లలను కూడా బడికి పంపడం లేదు’ అని ఓ పండిట్ చెప్పారు. కశ్మీర్ పండిట్లలో పీఎం ప్యాకేజీ కింద ఉద్యోగాలు పొందినవారిలో చాలా మంది ఇప్పటికే లోయను వదిలి పోయారని పేర్కొన్నారు. మిగతా 5-10% మంది కూడా రెండు మూడు రోజుల్లో వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
బుధవారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య 18వేల మంది కశ్మీర్ పండిట్లు శ్రీనగర్ సమీపంలోని మాతా ఖీర్ భవానీ ఆలయాన్ని సందర్శించారు. జ్యేష్ఠ అష్టమిని పురస్కరించుకొని పూజలు చేశారు. తుల్ముల్లాలో ఉన్న ఖీర్ భవానీ ఆలయంలో ప్రతీ ఏడాది జ్యేష్ఠ అష్టమి రోజున ఖీర్ భవానీ మేలా జరుగుతుంది. దాదాపు 2,500 మంది పండిట్లు సాయంత్రం హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, పీఎం ప్యాకేజీ కింద కశ్మీర్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి ప్రమోషన్లు కల్పించేందుకు జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం అనుమతించింది.