ఉద్యోగుల బదిలీలు ప్రారంభం
శ్రీనగర్, మే 23: రాహుల్ భట్ హత్య నేపథ్యంలో తమను కశ్మీర్ నుంచి వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలన్న పండిట్ వర్గం ఉద్యోగుల డిమాండ్కు కేంద్రం, జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం దిగొచ్చింది. కశ్మీరీ పండిట్ ఉద్యోగులను సురక్షితమైన ప్రాంతాలకు లేదా వారి నివాసాలకు దగ్గరిలోకి ఏరియాలకు బదిలీ చేయడం ప్రారంభించింది. జమ్ముకశ్మీర్ విద్యాశాఖ విభాగం ఇప్పటికే 50 మంది ఉపాధ్యాయులను బదిలీ చేయగా, మరిన్ని ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.
మరోవైపు కశ్మీర్ పండిట్లకు 2 సీట్లు రిజర్వ్ చేయడంతో పాటు, పాక్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ నుంచి వచ్చి స్థిరపడిన వారికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలనే డీలిమిటేషన్ కమిషన్ సిఫార్సు నివేదిక పార్లమెంట్కు వచ్చినప్పుడు కేంద్రం ఆమోదించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, రాహుల్ భట్ హత్యపై మొదట్లో సానుభూతి వ్యక్తం చేసిన హిందూత్వ గ్రూపులు.. ఇప్పుడు భట్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుపుతున్నాయి. రాహుల్ భట్ గతంలో తన ఫేస్బుక్ ఫ్రొఫైల్ పిక్చర్లో రోహింగ్యా ముస్లిములకు మద్దతుగా ఫొటో పెట్టారని పేర్కొంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. కాగా, తమను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యిందంటూ పండిట్లు వివిధ ప్రాంతాల్లో నిరసనలను కొనసాగించారు.