శ్రీనగర్: కశ్మీర్లో తొలి మల్టీప్లెక్స్ థియేటర్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. శ్రీనగర్లో తొలి మల్టీప్లెక్స్ థియేటర్ సెప్టెంబర్ నెలలో ఓపెన్కానుంది. ఐనాక్స్ సంస్థ ఆ థియేటర్ను సిద్ధం చేస్తున్నది. తీవ్రవాద కార్యకలాపాలు పెరగడంతో శ్రీనగర్లో 1990లో సినిమా టాకీస్లు మూతపడ్డాయి. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇప్పుడు ఓ మల్టీప్లెక్స్ థియేటర్ ఓపెన్ కానుండటం విశేషం. మూడేండ్ల క్రితం జమ్ముకశ్మీర్లో 370 ఆర్టికల్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో సరిహద్దులతోపాటు అంతర్గతంగా కూడా ఉగ్రవాద కార్యకలాపాలు గతంలో కంటే తగ్గిపోయాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా వినోద సాధనమైన థియేటర్లను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తున్నది. దీంతో కొన్ని కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు యువతకు సినిమా మాధ్యమాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చినట్లవుతుంది.