న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని నేషనల్ హెరాల్డ్ కార్యాలయాలపై ఈడీ దాడుల నేపధ్యంలో కేంద్రంలోని కాషాయ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం విమర్శలు గుప్పించారు. ఈ దాడులను బూటకంగా కొట్టిపారేసిన కార్తీ చిదంబరం కేంద్రం చేతిలో ఈడీ విధ్వంస ఆయుధంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దర్యాప్తు ఏజెన్సీ బలోపేతానికి ఊతమిస్తూ సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఈడీ మరింత పదునుతేలిందని, కేంద్రం చేతిలో విధ్వంస ఆయుధంగా మారిందని వ్యాఖ్యానించారు.
నిబంధనలను తోసిరాజేస్తూ దాడులు, సమన్లు, అరెస్టులతో చెలరేగుతున్నారని అన్నారు. ఖాతా పుస్తకాల్లో అన్ని వివరాలు లభించే పబ్లికేషన్స్ కార్యాలయాలపై దాడులు చేయడం మూర్ఖత్వమని మండిపడ్డారు. పాలకులను మెప్పించేందుకు నేషనల్ హెరాల్డ్ కార్యాలయాలపై దాడులు చేపట్టారని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వ జేబు సంస్ధగా ఈడీ మారిందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ ఉద్యోగులు, సంస్ధ సిబ్బందికి అసౌకర్యం కలిగించేందుకే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
విపక్షాల గొంతు నొక్కే కేంద్ర ప్రభుత్వ కుట్రలోనే భాగంగా ఈ దాడులకు తెగబడ్డారని అన్నారు. డీహెచ్ఎఫ్ఎల్ రూ 34,615 కోట్లు నష్టపోయిందని, మెహుల్ చోక్సీ నుంచి నీరవ్ మోదీ వరకూ వేలాది కోట్లు దిగమింగారని వీటి గురించి ప్రభుత్వం ఏమైనా కలత చెందుతోందా అసలు వారిని తిరిగి దేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారా అని మోదీ సర్కార్ను నిలదీశారు.