Toilet Video Scandal| బెంగళూరు: ఉడిపి టాయ్లెట్ వీడియో స్కాండల్కు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ కార్యకర్త శకుంతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉడిపి కేసును బీజేపీ రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నదని ఓ కాంగ్రెస్ నాయకుడు చేసిన ట్వీట్ను శకుంతల షేర్ చేశారు. ‘సిద్ధరామయ్య కోడలికో లేదా భార్యకో ఇలానే జరిగితే మీరు ఇలానే స్పందిస్తారా?’ అంటూ ఆ పోస్ట్పై ఆమె కామెంట్ చేశారు. దీనిని ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సిద్ధరామయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది. శుక్రవారం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
ఉడిపిలోని ప్రైవేట్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కళాశాలలో మైనార్టీ వర్గానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు మహిళల టాయ్లెట్లో మొబైల్తో వీడియోలు చిత్రీకరించినట్టు గత వారం బయటకు రావడం కలకలం రేపింది. టాయ్లెట్లో మొబైల్ ఫోన్ ఉండటాన్ని ఓ విద్యార్థిని గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొబైల్లో అభ్యంతరకర వీడియోలు ఉన్నట్టు విచారణలో తేలింది. ముగ్గురు విద్యార్థినులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తున్నది. ఇది స్నేహితుల మధ్య జరిగిన చిన్న విషయమని, దీన్ని రాజకీయం చేయడం అవసరమా అని హోంమంత్రి పరమేశ్వర ప్రశ్నించారు.