బెంగళూరు, మార్చి 7: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఒక పక్క 4.48 లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినా, అడుగడుగునా అప్పులు, బాకీల తిప్పలు ప్రభుత్వానికి తప్పడం లేదు. అభివృద్ధి కోసం అప్పులు తప్పవంటూ సీఎం సిద్ధరామయ్య తన చర్యను సమర్థించుకుంటున్నారు.
ఒక వైపు అన్నింటి ధరలను పెంచేస్తూ ప్రజలపై భారం మోపుతున్న ప్రభుత్వం.. సంక్షేమ పథకాల అమలుకు ఆపసోపాలు పడుతున్నది. కాగా, ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయి పడగా, వారు పెండింగ్ బిల్లులు చెల్లించాలని తీవ్ర ఒత్తడి తెస్తున్నారు. దీంతో వారి బకాయిలు తీర్చడానికి బాండ్ల జారీ ద్వారా రుణాలు తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది.
చిరకాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని బెంగళూరులోని ఫ్రీడం పార్క్ వద్ద కర్ణాటక స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. దీంతో ఆ సంఘం నేతలతో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ మాట్లాడుతూ ఈ సమస్యపై తాను, ప్రజా పనుల శాఖ మంత్రి జార్ఖిహోళిలు ముఖ్యమంత్రితో భేటీ అయ్యి, ఈ సమావేశాల్లోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వివిధ శాఖల్లో సుమారు 37 వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్న విషయాన్ని ఆయన అంగీకరిస్తూ, కాంట్రాక్టర్ల బాధ తనకు తెలుసునని అన్నారు.