హిజబ్ వివాదం కారణంగా మూతపడ్డ విద్యా సంస్థలను పునః ప్రారంభించడానికి కర్నాటక ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తోంది. ఇదే విషయంపై శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంత్రులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ అధికారులు కూడా పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే విడతల వారీగా విద్యా సంస్థలను తెరవాలన్నది ప్రభుత్వం ఆలోచనగా చెబుతున్నారు.
మొదటి దశలో పాఠశాలలను తెరవాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఇంటర్, డిగ్రీ, ఆపై విద్యా సంస్థల పునః ప్రారంభం మరో విడతలో చేయాలని ప్రభుత్వం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు హిజబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతూరాజ్ అవస్థి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. విద్యా సంస్థలు తెరుచుకునేలా ఆదేశాలు జారీచేస్తామన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ విద్యార్థులు ఎలాంటి మతపరమైన సంకేతాలు వచ్చేవిధంగా వస్త్ర ధారణ చేయవద్దని ఆదేశించింది.