బెంగళూరు, మే 25: కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన పాఠ్యపుస్తకాల సవరణపై వివాదం తీవ్రమవుతున్నది. పుస్తకాల్లో చేర్చిన తమ రచనలను తొలగించాలని పలువురు ప్రముఖ రచయితలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సాహితీవేత్త, దళిత నేత దేవనూర్ మహదేవ్, రచయిత జి రామకృష్ణ కర్ణాటక విద్యాశాఖను కోరారు. ‘పాఠ్యపుస్తకాల రివిజన్పై వివాదం నడుస్తున్నది. పదో తరగతి కన్నడ సబ్జెక్టులో నా ఆర్టికల్ను ఉపయోగించారు. ప్రతి నిమిషానికీ ఈ మార్పులు చేర్పులు మారుతున్నాయి. పుస్తకంలో నా రచనను వాడకుంటే ఆనందిస్తాను. ఒకవేళ చేరిస్తే, అందుకు నా అనుమతి లేదు’ అని మహదేవ పేర్కొన్నారు. ప్రచురణకు గతంలో ఇచ్చిన అనుమతులను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. ఎల్ బవసరాజు, ఏఎన్ మూర్తీరావు, పి లంకేష్, సారా అబూబకర్ రచించిన పాఠాలను తొలగించిన వారికి కన్నడ సంస్కృతి తెలియదన్నారు. పాఠ్యపుస్తకాల సవరణ ప్రక్రియ ప్రమాదకరమైన మార్గంలో సాగుతున్నదని, విద్యను రాజకీయ సాధనంగా ఉపయోగించుకోవడం క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.