బెంగళూరు, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక బీజేపీలో రేగిన అసంతృప్తి మంటలు చల్లారడం లేదు. టికెట్ నిరాకరణకు గురైన నేతలు పార్టీ నాయకత్వం తీరుపై అసమ్మతితో రగిలిపోతున్నారు. పలువురు పార్టీకి రాజీనామాలు చేస్తుండగా, మరికొందరు ఇతర పార్టీల బాట పట్టారు. మరి కొంతమంది బీజేపీ రెబల్స్గా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నారు. అసంతృప్తితో రగిలిపోతున్న వారి జాబితాలో కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. తనకు హుబ్లీ-ధార్వాడ సెంట్రల్ టికెట్ ఇవ్వకపోతే 20-25 సీట్లలో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంతటి అవమానాన్ని, మానసిక హింసను తన జీవితంలో ఎన్నడూ అనుభవించలేదని జగదీశ్ శెట్టర్ అన్నారు. శనివారం రాత్రి ఆయనతో కేంద్రమంత్రులు ధర్మేంద్రప్రదాన్, ప్రహ్లాద్ జోషి, కర్ణాటక సీఎం బొమ్మై చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలం కావటంతో శెట్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం మధ్యాహ్నం స్పీకర్ను కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. పోటీపై అనునూయులతో చర్చించి నిర్ణయం తీసుకుం టానని వెల్లడించారు.
బీజేపీ నుంచి కాంగ్రెస్, జేడీఎస్లోని వలసలు శనివారం కూడా కొనసాగాయి. టికెట్ రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు మహదేప్ప యాదవాడ, అనిల్ బెనక కాంగ్రెస్ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. అరసికెరె నియోజకవర్గ బీజేపీ నేత సంతోష్ జేడీఎస్లో చేరి టికెట్ సంపాదించారు. కుమారస్వామి, భారతి శంకర్ కూడా జేడీఎస్ కండువా కప్పుకొన్నారు. మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్, జేడీఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు జేడీఎస్ శనివారం 12 పాయింట్లతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. స్త్రీ శక్తి గ్రూపులకు రుణమాఫీ, ఏడాదిలో 5 ఉచిత సిలిండర్లు, గర్భిణికి రూ.6 వేల అలవెన్స్, వితంతు పింఛను రూ.900 నుంచి రూ.2,500 పెంపు హామీలు ఇచ్చింది. రైతులకు ఎకరాకు రూ.10 వేల సబ్సిడీ, వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.2 వేల అలవెన్స్, రైతు కొడుకులను పెండ్లి చేసుకొనే మహిళలకు రూ.2 లక్షలు ఇస్తామని పేర్కొన్నది.
కాంగ్రెస్ పార్టీ శనివారం 43 మంది పేర్లతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసింది. బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవదికి అథని స్థానం టికెట్ కేటాయించింది.