Karnataka | బెంగళూరు, నవంబర్ 18: కర్ణాటకలో కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. దోచుకోవడమే పనిగా పెట్టుకొన్నదని, రాష్ర్టాన్ని ఏటీఎంగా మార్చుకొన్నదనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్పై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తాజాగా ‘క్యాష్ ఫర్ పోస్టింగ్స్ (పోస్టింగ్, బదిలీలకు ముడుపులు)’ స్కామ్కు సంబంధించి సీఎం సిద్ధరామయ్య, ఆయన కుమారుడు యతీంద్రకు మధ్య జరిగిన ఫోన్ కాల్ అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నది. మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి సీఎం సిద్ధరామయ్యను టార్గెట్గా చేసుకొని శనివారం మరోసారి ‘క్యాష్ ఫర్ పోస్టింగ్స్’ ఆరోపణలు చేశారు. ఫోన్ సంభాషణలో వినిపించిన ‘వివేకానంద’ అనే పేరు శుక్రవారం రాత్రి ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్ల బదిలీల జాబితాలో కనిపించిందని ఆరోపించారు. ఈ మేరకు జాబితాను ఆయన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
వివేకానంద పేరు 48 గంటల్లో బదిలీల జాబితాలో ఎలా వచ్చిందని కుమారస్వామి ప్రశ్నించారు. ‘నైతికత గురించి మాటలు చెప్పే మీరు(సిద్ధరామయ్య).. ఇప్పుడు అవినీతిలో మునిగారు. సీఎం అంతరంగం బయటపడింది. దీనికి మీరు సిగ్గుపడాలి’ అంటూ కుమారస్వామి ధ్వజమెత్తారు. ఫోన్ సంభాషణపై సీఎం చెప్పిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్ఆర్) కథను ‘డూప్లికేట్ సీఎం’ సూచన మేరకు అల్లారని డిప్యూటీ సీఎం డీకేను పరోక్షంగా ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. కుమారస్వామి ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుమారస్వామి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ సర్కార్ కర్ణాటకను ఏటీఎంలా వాడుకొంటున్నదనే దానికి తాజా ఫోన్ సంభాషణ వీడియో సాక్ష్యమని, రాష్ట్రంలో ‘60 శాతం కమీషన్’ సర్కార్ నడుస్తున్నదని ప్రతిపక్ష బీజేపీ నేత అశోక ఆరోపించారు.
ఎన్నికల హామీల అమలులో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ బెంగళూరులో పోస్టర్లు వెలిశాయి. గ్యారెంటీ స్కీమ్ల అమలులో హస్తం పార్టీ ఘోరంగా విఫలమైందని ఆ పోస్టర్లు ఎత్తిచూశాయి. పోస్టర్లలోని అంశాలు ఇలా ఉన్నాయి..