బెంగళూర్ : కర్నాటకలో హిజాబ్ వివాదంపై తలోరకంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి ప్రదేశానికి ఓ డ్రెస్ కోడ్ ఉంటుందని కర్నాటక ఎంపీ సుమలతా అంబరీష్ బుధవారం అన్నారు. ఈ అంశంపై చిన్నారుల మెదళ్లను విషపూరితం చేసేలా రాజకీయాలు సాగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మీరు స్విమ్మింగ్ పూల్లో బికినీ వేసుకుంటారు కానీ స్కూల్లో కాదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్ను పరోక్షంగా ప్రస్తావిస్తూ సుమలత వ్యాఖ్యానించారు. విద్యార్ధుల భవిష్యత్తో ఎవరు చెలగాటమాడుతున్నారని ఆమె నిలదీశారు. హిజాబ్ ధరించిన విద్యార్ధులను విద్యాసంస్ధలు అనుమతించకపోవడంతో కర్నాటకలో ఈ వివాదం రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కర్నాటక ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యాసంస్ధలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఈ అంశాన్ని హైకోర్టు విస్తృత ధర్మాసనానికి బదలాయించింది. కాగా అంతకుముందు మహిళలు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని, ఇది రాజ్యాంగం వారికి కల్పించిన హక్కని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ బుధవారం ట్వీట్ చేశారు. బికినీ, జీన్స్ లేదా హిజాబ్ ఏదైనా ధరించే స్వేచ్ఛ మహిళలకు రాజ్యాంగం ప్రసాదించిందని ఆమె పేర్కొన్నారు.
ఈ విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావులేదని, అసలు మహిళకు ఆమె ఏం ధరించాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఇక హిజాబ్ వివాదం కొనసాగుతుండగా అంతకుముందు హిజాబ్ నిషేధాన్ని సమర్ధిస్తూ స్కూల్స్లో డ్రెస్ కోడ్ ప్రతిపాదనను సమర్ధించిన మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ ఆపై యూటర్న్ తీసుకున్నారు. మధ్యప్రదేశ్లో హిజాబ్పై ఎలాంటి వివాదం లేదని మంత్రి స్పష్టం చేశారు. హిజాబ్ నిషేధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదననూ పరిశీలించడం లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎలాంటి గందరగోళానికీ తావులేదని చెప్పుకొచ్చారు. కర్నాటకలో హిజాబ్ ధరించడానికి అనుకూలంగా, ప్రతికూలంగా జరుగుతున్న ఆందోళనలపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా స్పందించారు. సున్నితమైన ఈ వ్యవహారంలో దేశంలో వాతావరణాన్ని చెడగొట్టేందుకు కొందరు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
డ్రెస్ కోడ్పై తన మాటలను కొందరు వక్రీకరించారని విద్యాశాఖ మంత్రి పర్మార్ వివరణ ఇచ్చారు.తాము ఎలాంటి డ్రెస్ కోడ్ను, నూతన యూనిఫాంను ప్రవేశపెట్టడం లేదని స్పష్టం చేశారు. స్కూళ్లలో సమానత్వానికి సంకేతంగా విద్యార్ధులందరూ యూనిఫాంను ధరించాలని ఆయన కోరారు. ఇక ముస్లిం యువతులు ఎప్పటినుంచో హిజబ్ ధరిస్తున్నారని ఇప్పుడు దీనిపై అభ్యంతరాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ముస్లిం యువతులను హిజబ్ ఆధారంగా వేరు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఇది పూర్తిగా వివక్షతో కూడుకున్నదని మండిపడ్డారు. ఏ ఒక్కరి రాజ్యాంగ హక్కును నిరాకరించడం సరైంది కాదని అన్నారు. ముస్లిం యువతులను హిజబ్ ధరించకుండా మీరు ఎలా వేరుచేస్తారని ఆయన ప్రశ్నించారు. బేటీ బచావో..బేటీ పఢావో అని బీజేపీ నినదిస్తుండగా అసలు హిజబ్ వ్యవహారంలో మహిళా సాధికారత ఎక్కడ ఉందని ఓవైసీ ఓ వార్తాచానెల్తో మాట్లాడుతూ అన్నారు. ముస్లిం బాలిక ఇంటి నుంచి కాలుబయట పెడితే హిజబ్ ధరిస్తుందని, అనూహ్యంగా వీరికి కాషాయ కండువాలు ఎవరిస్తున్నారని అన్నారు. కాషాయ శాలువాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఓవైసీ నిలదీశారు.