బెంగళూరు: కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేశారు. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు సంబంధించిన వివాదం నేపథ్యంలో శుక్రవారం రాత్రి సీఎం బసవరాజ్ బొమ్మైకి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఎం నివాసంలో కేఎస్ ఈశ్వరప్పతోపాటు మంత్రులు బైరతి బసవరాజ, ఎంటీబీ నాగరాజ్, ఆరగ జ్ఞానేంద్ర, ఎమ్మెల్యే రమేష్ జార్కిహోళి తదితరులు ఉన్నారు.
అయితే రాజీనామా చేసే ముందు ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సచ్ఛీలుడిగా నిరూపించుకొని, మళ్లీ మంత్రినవుతానని తెలిపారు. కాంట్రాక్టర్ సంతోష్ సూసైడ్ నోట్లో తన పేరు ఉండటం కుట్ర అని అన్నారు. ‘నాపై ఆరోపణ మోపారు. వాటిని క్లియర్ చేసుకోవాలి కదా. నిర్దోషిగా బయటకు రావాలి కదా. ఒకవేళ మంత్రి పదవిలో కొనసాగితే.. నేను విచారణను ప్రభావితం చేశానన్న అపవాదు వస్తుంది. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. కానీ.. నేను నిర్దోషిగానే బయటికి వస్తా. మరోసారి మంత్రినవుతా’ అని ఈశ్వరప్ప పేర్కొన్నారు.
మంత్రి ఈశ్వరప్ప ఒత్తిళ్లు, బెదిరింపులు తాళలేక రెండు రోజుల క్రితం సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడటంతో కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేగింది. మంత్రి ఈశ్వరప్ప ఒత్తిళ్ల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు బీజేపీకి చెందిన సంతోష్ పాటిల్ తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఈశ్వరప్ప, ఆయన సన్నిహితులపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కర్ణాటకలోని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేయడంతోపాటు భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.