బెంగళూరు: తనకు కేటాయించిన శాఖలపై కర్ణాటక మంత్రి ఆనంద్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను కోరిన మంత్రిత్వ శాఖలు దక్కలేదని, పార్టీ ఫోరమ్లో తాను చేసిన అభ్యర్థన ఏదీ పరిగణించలేదని ఆయన వాపోయారు. ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, టూరిజం శాఖలు తనకు ఇవ్వడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోర్ట్ఫోలియోలను తాను కోరలేదన్నారు. సీఎం బసవరాజ్ బొమ్మైను కలిసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. తన అభ్యర్థనను పునఃపరిశీలించాలని సీఎంను కోరుతానని మంత్రి ఆనంద్ సింగ్ తెలిపారు.
కాగా, బీజేపీ ఎమ్మెల్యేలో తనపై అసంతృప్తి నేపథ్యంలో జూలై 27న సీఎం పదవికి యెడియూరప్ప రాజీనామా చేయగా, జూలై 28న కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రెండు రోజులకు 29 మంది మంత్రులతో కేబినెట్ను ఆయన విస్తరించారు. అయితే తమకు దక్కిన శాఖలపై కొందరు మంత్రులు అసంతృప్తితో ఉన్నారు. ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, టూరిజం శాఖల మంత్రి ఆనంద్ సింగ్ తన ఆవేదనను శనివారం బహిరంగంగా వ్యక్తం చేశారు. శాఖల మార్పుపై సీఎం బొమ్మైని కలిసి మాట్లాడతానని చెప్పారు.