బెంగళూరు: దేశంలో మరోసారి కరోనా అలజడి రేగుతున్నది. పొరుగు దేశమైన చైనాలో బీఎఫ్.7 వేరియంట్ వణికిస్తున్నది. ఈ కొత్త రకం కరోనా వైరస్కు సంబంధించిన కేసులను భారత్లో గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించింది. కరోనా టెస్ట్లు నిర్వహించాలని, వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. దీంతో పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షలు విధిస్తున్నాయి.
కాగా, మూసి ఉన్న ప్రదేశాలు, ఎయిర్ కండీషన్ (ఏసీ) గదుల్లో మాస్కులు ధరించడాన్ని కర్ణాటక ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అలాగే ఫ్లూ లక్షణాలుండే ఇన్ఫ్లుఎంజా వంటి రోగాలు, తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (ఎస్ఆర్ఐ) బారినపడిన వారికి తప్పని సరిగా కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. సీఎం బసవరాజ్ బొమ్మై ఆధ్వర్యంలో గురువారం కరోనాపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుధాకర్ మీడియాకు తెలిపారు. కరోనా టెస్టులు, మాస్కులు ధరించడంపై మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు.