బెంగళూరు, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)(స్పెషల్ టాస్క్ బ్యూరో) : ‘40% కమీషన్రాజ్’.. ఇది కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి పర్యాయపదంగా మారింది. బీజేపీ సర్కారు అవినీతి దాహానికి కిందటేడాదిలోనే పది మందికి పైగా కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకొన్నారంటే అక్కడ అవినీతిరాజ్ ఏ స్థాయికి చేరుకొన్నదో అర్థం చేసుకోవచ్చు. తాజాగా జరిగిన మరో ఘటన దీనికి పరాకాష్టగా నిలిచింది. సబ్బుల తయారీ కోసం అవసరమయ్యే ముడి వస్తువుల సరఫరాకు టెండరు ఇప్పిస్తానంటూ ఒక కాంట్రాక్టర్ నుంచి రూ. 40 లక్షలు లంచం తీసుకొంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మాడాళు విరూపాక్షప్ప కుమారుడు మాడాళు ప్రశాంత్.. లోకాయుక్త అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ క్రమంలో అతడి ఆఫీసు, ఇంట్లో సోదాలు చేపట్టిన అధికారులు భారీ మొత్తంలో నగదును గుర్తించారు. ప్రశాంత్ ఆఫీసు, ఇంట్లో మొత్తం రూ. 8 కోట్లకు పైగా నోట్ల గుట్టలతో పాటు బంగారం, ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారం సూత్రధారి విరూపాక్షప్పనేనని, ఆయన ఆదేశాలతోనే ప్రశాంత్ లంచం తీసుకొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
కర్ణాటకలోని దావణగెరె జిల్లా చెన్నగిరి అసెంబ్లీ ఎమ్మెల్యే మాడాళు విరూపాక్షప్ప. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కేఎస్డీఎల్- మైసూర్ శాండిల్ సోప్స్ పరిశ్రమ) ఛైర్మన్గా కూడా ఉన్నారు. విరూపాక్షప్ప కుమారుడు మాడాళు ప్రశాంత్. బెంగళూరు జలమండలిలో చీఫ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. కేఎస్డీఎల్కు ముడి వస్తువుల సరఫరా టెండరు ఇప్పిస్తానని, దీనికోసం రూ. 81 లక్షలు చెల్లించాలని కాంట్రాక్టర్ శ్రేయస్ కశ్యప్ను ప్రశాంత్ డిమాండ్ చేశాడు. దీనిపై శ్రేయస్ వారంకిందటే లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు శ్రేయస్కు ప్రత్యేక సూచనలు చేశారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో కేఎస్డీఎల్ కార్యాలయంపై ఆకస్మిక దాడి చేశారు. అక్కడ తొలి విడుతగా రూ. 40 లక్షల లంచం తీసుకొంటున్న ప్రశాంత్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకొని డబ్బును స్వాధీనం చేసుకొన్నారు. అదే ఆఫీసులో సోదాలు నిర్వహించి మరో మూడు బ్యాగుల్లోని రూ. 2.02 కోట్లు స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం సంజయ్నగర్లోని ప్రశాంత్ నివాసానికి వెళ్లి సోదాలు నిర్వహించారు. అక్కడ మరో రూ. 6.1 కోట్ల నగదుతో పాటు బంగారం, ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకొన్నారు. వీటి మొత్తం విలువ రూ. 8 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కేసుతో సంబంధమున్న వారి ఇండ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం నగదు స్వాధీనం కావటం లోకాయుక్త చరిత్రలోనే మొదటిసారని అధికారులు చెప్తున్నారు.
ఎమ్మెల్యే మాడాళు విరూపాక్షప్ప, ప్రశాంత్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు లోకాయుక్త పోలీసులు తెలిపారు. లంచం కేసులో భాగమైన నిందితులు ప్రశాంత్ మాడాళు (ఏ2), ఆయన బంధువు సిద్ధేశ్, సహకరించిన సురేంద్ర(అకౌంటెంట్), నికోలస్, గంగాధరయ్యకు లోకాయుక్త న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
లంచం తీసుకొన్న కేసులో తనకు వ్యతిరేకంగా ఆరోపణలు వచ్చినందుకు మాడాళు విరూపాక్షప్ప శుక్రవారం కేఎస్డీఎల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన కుటుంబంపై కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. లంచం వ్యవహారం బయటపడినప్పటి నుంచి ఎమ్మెల్యే పరారీలో ఉన్నారని, అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకొన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
‘కర్ణాటకలో అవినీతిని అంతం చేస్తామని సండూరు సభలో అమిత్ షా ప్రగల్భాలు పలికారు. దాని అర్థం బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ద్వారా లంచం తీసుకోవటమా?’ అని ప్రశ్నించారు. ‘మీ డబుల్ ఇంజన్ సర్కారు నలభై శాతం కమీషన్ మురికిలో పడి దొర్లుతున్నదనడానికి మాడాళు ప్రశాంత్ అరెస్టు కంటే గొప్ప ఉదాహరణ ఏం కావాలి’ అని ఎద్దేవా చేశారు. కర్ణాటక ఎవరికి ఏటీఎం అయ్యిందో చెప్పాలని డిమాండ్ చేశారు.