విజయపుర: కర్నాటకలోని విజయపుర జిల్లాకు చెందిన శ్రీ సిద్దేశ్వర లోక కళ్యాణ్ చారిటబుల్ ట్రస్టు ఇవాళ ఓ ప్రకటన చేసింది. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట(Ayodhya Ceremony) జరగనున్న నేపథ్యంలో జేఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో జరిగే ప్రసవాలను ఉచితంగా(Free Deliveries) చేయనున్నట్లు ఆ ట్రస్టు ప్రకటించింది. జనవరి 18వ తేదీ నుంచి జనవరి 22వ తేదీ వరకు జరిగే ప్రసవాలను ఫ్రీగా నిర్వహించనున్నట్లు ట్రస్టు వెల్లడించింది. ఇవాళ్టి నుంచి తమ ఆస్పత్రిలో జరిగే ప్రసవాలకు ఉచిత వైద్యం అందించనున్నట్లు ఆస్పత్రి అధికారి తెలిపారు. అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట ఓ గొప్ప కార్యక్రమం అని, అందుకే తమ వద్ద అయిదు రోజుల పాటు ప్రసవాలను ఫ్రీగా చేయనున్నట్లు ఆస్పత్రి అధికారి చెప్పారు. ఇవాళ తొలి రోజే ఏడుగురు గర్భిణులకు ప్రసవాలను ఉచితంగా చేసినట్లు వెల్లడించారు.
ఆస్పత్రి ప్రకటన పట్ల విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యంతల్ స్పందించారు. అయోధ్య సంబరాలు మొదలైనట్లు ఆయన వెల్లడించారు. జేఎస్ఎస్ హాస్పిటల్లో జనవరి 18వ తేదీ నుంచి 22 వరకు జరిగే డెలివరీలను ఉచితంగా చేస్తారని, ఒకవేళ అబ్బాయి పుడితే.. అతన్ని రామావతారంగా, ఒకవేళ అమ్మాయి పుడితే ఆమెను సీత రూపంగా భావిస్తామని ఆయన అన్నారు.