Karnataka | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): అది కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా జమఖండి తాలూకా కంకన్వాడి గ్రామం. దాదాపు 300 మంది జనాభా ఉంటారు. రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ప్రభుత్వాలు మారాయి.. నాయకులు మారారు.. అయినా వారి గ్రామం పక్కన ఉండే కృష్ణా నది దాటి తమ వ్యవసాయ భూముల్లోకి వెళ్లేందుకు అవసరమైన వంతెన వ్యథ మాత్రం తీరలేదు.
బ్రిడ్జి నిర్మించాలని ఎన్నిసార్లు అభ్యర్థనలు పెట్టుకొన్నా పాలకులు పట్టించుకొన్న పాపాన పోలేదు. దీంతో విసుగెత్తిపోయిన గ్రామస్థులు, రైతులు.. తమకు తాముగానే దాదాపు రూ.24 లక్షల మేర చందాలు వేసుకొని కర్రల వంతెన నిర్మించుకొన్నారు. మరో రెండు లక్షలు ఖర్చు పెట్టి ఆ వంతెనను ఓ మంత్రితోనే ఆవిష్కరింపజేసి.. ఇన్నేండ్లుగా పాలకులు వహించిన నిర్లక్ష్య వైఖరిని బయటి ప్రపంచానికి చాటారు.
పొలాలకు వెళ్లాలంటే నరకయాతన
కంకన్వాడి గ్రామానికి పక్కనే కృష్ణా నది ఉంటుంది. ఆ నదికి ఆవలి వైపున గుహేశ్వర్ ద్వీపంలో గ్రామస్థులకు మొత్తంగా 800 ఎకరాల మేర వ్యవసాయ భూములు ఉంటాయి. నది దాటితే గానీ వారి భూములకు వెళ్లలేని పరిస్థితి. ప్రతి ఏటా నదిని దాటుకొని తమ భూముల్లోకి వెళ్లాలంటే నరకయాతన అనుభవించాల్సిందే. అంత పెద్ద బ్రిడ్జి కట్టలేమని చేతులెత్తేసిన ప్రభుత్వం గ్రామస్థులకు ఓ మెకనైజ్డ్ బోటును మాత్రం అందించింది.
ప్రతి ఏడాదీ ఆ బోట్ నిర్వహణ కోసమే గ్రామస్థులు రూ.5-6 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. బ్రిడ్జి నిర్మించి తమకు రాకపోకల సౌకర్యం కల్పించాలని 1985 నుంచి విన్నవించుకొన్నా, అర్జీలు పెట్టుకొన్నా.. ఏ ప్రభుత్వం గానీ, అధికారి కానీ, నాయకుడు కానీ పట్టించుకోలేదు. దాంతో విసిగి వేసారిన గ్రామ ప్రజలు యూట్యూబ్ ద్వారా ఓ కర్రల వంతెన గురించి తెలుసుకొని, ఆ వీడియోను స్ఫూర్తిగా తీసుకొని లక్షల రూపాయల చందాలతో నది దాటేందుకు ఒక కర్రల వంతెన నిర్మించుకున్నారు.
3 నెలల్లో బ్రడ్జి నిర్మాణం పూర్తి
30 మంది రైతులు మూడు నెలల్లో తాళ్లతో కూడిన వంతెనను నిర్మించుకోవడం చర్చనీయాంశంగా మారింది. 800 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో వంతెన నిర్మాణ పనులు పూర్తి చేశారు. కొసమెరుపేమంటే జిల్లాకు చెందిన ఎక్సైజ్ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ను ఆహ్వానించి ధూంధాంగా వంతెనను ప్రారంభించుకొన్నారు. దీంతో మంత్రి గ్రామస్థులను అభినందించక తప్పలేదు. ఈ వార్తను చదివిన నెటిజన్లు మాత్రం పాలకులు, అధికారులు సిగ్గుపడేట్టు చేశారని కామెంట్లు చేస్తున్నారు.